suryapeta: సూర్యాపేట‌లో విషాదం... ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ఆత్మ‌హ‌త్య‌!

  • కుటుంబం ఉసురు తీసిన ఆర్థిక క‌ష్టాలు
  • మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు
  • షాక్‌లో ప‌ట్ట‌ణం

ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబం ఉసురు తీశాయి. క‌ష్టాల‌కు తాళ‌లేని కుటుంబం మొత్తం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సూర్యాపేట‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. విష‌యం తెలిసిన ప‌ట్ట‌ణం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. ప‌ట్ట‌ణంలోని స్థానిక క‌స్తూరీ బ‌జార్‌లో నివ‌సించే క‌స్తూరి జనార్దన్ (59) కుటుంబం గ‌త కొంత‌కాలంగా ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతోంది. క‌ష్టాలు తీరే మార్గం క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించారు. కుటుంబంలోని ఆరుగురు క‌లిసి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను జ‌నార్ద‌న్‌, చంద్ర‌క‌ళ (50), ప్ర‌భాత (30), అశోక్ (25), సిరి (5), రుత్విక (2)లుగా గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు త‌మ మ‌ధ్య ఉన్న వారు తెల్లారేస‌రికి విగ‌త జీవులుగా మార‌డం చూసి ప‌ట్ట‌ణ‌వాసులు క‌న్నీటి పర్యంత‌మ‌వుతున్నారు.

More Telugu News