: చంద్రబాబుతో పళనిస్వామికి చెప్పించండి సార్... చిదంబరం వెళ్లిన మురళీ మోహన్ కు తెలుగువారి విజ్ఞప్తి!

పవిత్ర కావేరీ నది పుష్కరాలు రెండు రోజుల క్రితం ప్రారంభం కాగా, పుణ్యస్నానాలు ఆచరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని నది వద్దకు వెళుతున్న వేలాది మంది తెలుగువారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుదూరం నుంచి వచ్చే తమకు కనీస వసతులు కల్పించడంలో తమిళ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. తమిళనాడుకు వెళుతున్న యాత్రికుల్లో 90 శాతం తెలుగువారు కాగా, పది శాతం వరకూ ఒడిశా వాసులు వున్నారు.

ఈ క్రమంలో పుష్కర స్నానం చేసేందుకు నటుడు, ఎంపీ మురళీ మోహన్ చిదంబరంకు వెళ్లగా, అక్కడికి వచ్చిన తెలుగు యాత్రికులు ఆయన్ను కలిసి తమ బాధలు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మురళీ మోహన్, ప్రజలు తాము పడుతున్న కష్టాలు చెబితే తనకు బాధ కలిగిందని అన్నారు. కృష్ణా, గోదావరి పుష్కరాల సమయంలో ఏర్పాట్లు అద్భుతంగా చేశారని, ఇక్కడ మాత్రం అటువంటివి కనిపించడం లేదని యాత్రికులు ఫిర్యాదు చేశారని చెప్పారు. యాత్రికులకు కనీస సౌకర్యాలు కల్పించేలా తమిళనాడు ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబుతో చెప్పించాలని తనను కోరారని అన్నారు. తాను చంద్రబాబును కలిసి ఈ విషయమై మాట్లాడతానని చెప్పారు.

More Telugu News