: వరల్డ్ ఎలెవన్‌పై పాక్ గెలుపు.. ఇండిపెండెన్స్ కప్‌లో 1-0తో ముందంజ

సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించి అభిమానుల్లో జోష్ నింపింది. ఇండిపెండెన్స్ కప్‌లో భాగంగా వరల్డ్ ఎలెవన్‌తో మూడు టీ20ల సిరీస్‌ మంగళవారం ప్రారంభమైంది. లాహోర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్ బ్యాట్స్‌మన్‌లలో బాబర్ ఆజం 86, షోయబ్ మాలిక్ 38, అహ్మద్ షెజాద్ 39 పరుగులతో మెరుపులు మెరిపించారు.

 అనంతరం 198 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వరల్డ్ ఎలెవన్ జట్టు లక్ష్య ఛేదనలో చతికిల పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. హషీం ఆమ్లా 26, టిమ్ పైన్ 25, డుప్లెసిస్ 29 పరుగులు చేశారు. చివర్లో సామి (29) మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. సుదీర్ఘ కాలం తర్వాత పాక్‌లో సిరీస్ జరుగుతుండడంతో పండుగ వాతావరణం కనిపించింది. ఈ సిరీస్ తర్వాత ప్రపంచ దేశాలు తమ దేశంలో క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతాయని పాక్ భావిస్తోంది.

More Telugu News