: పానీపూరీ డిస్పెన్సర్‌ మిషన్‌ను కనిపెట్టిన విద్యార్థులు.. శుభ్రత విషయంలో ఇక బేఫికర్!

పానీపూరీ.. చిన్నారులు, కాలేజీ విద్యార్థుల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన స్ట్రీట్  ఫుడ్ ఇది. అయితే పానీ పూరీ విక్రయదారులు సరైన శుభ్రత పాటించని కారణంగా చాలామంది తమ జిహ్వ చాపల్యాన్ని చంపుకుంటున్నారు. అయితే ఇకపై అలా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం రాదేమో! ఎందుకంటే కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీ విద్యార్థులు పానీపూరీని ప్లేట్లలో వడ్డించే మిషన్ ‘పానీపూరీ డిస్పెన్సర్’ను కనుగొన్నారు.

మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ యంత్రాన్ని కనుగొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో టీ-హబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ యంత్రం జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. సాహాస్ గెంబాలి, సునంద సోము, నేహ శ్రీవాస్తవ, కరిష్మా అగర్వాల్ కలిసి ఈ మిషన్‌ను రూపొందించారు.

ఈ యంత్రం వల్ల శుభ్రతకు శుభ్రత, వేగం కూడా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. ఖర్చు కూడా చాలా తక్కువని, ఇకపై శుభ్రత గురించి ఆలోచిస్తూ పానీపూరీకి దూరమైన వారు నిరభ్యంతరంగా పానీపూరీని ఆస్వాదించవచ్చన్నారు. త్వరలోనే ఈ మిషన్‌ను కమర్షియల్ ప్రొడక్ట్‌గా తీర్చిదిద్దుతామని, విదేశాల్లో ఎక్కువ మంది భారతీయులు నివసిస్తున్న నేపథ్యంలో వీటిని ఎగుమతి చేస్తామని వివరించారు.

More Telugu News