: మా తాతయ్య నాకో మంచి మాట చెప్పారు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విద్యతోనే విఙ్ఞానం, వివేకం, వివేచన లభిస్తాయని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీ విఙ్ఞాన్ భవన్లో జరిగిన 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, అక్షరాస్యత లేకుంటే అభివృద్ధికి అర్థమే లేదని, దేశాభివృద్ధిలో అక్షరాస్యత అత్యంత ప్రధానమైన అంశమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోవడంపై ఆలోచించాలని అన్నారు.

1947లో 18 శాతం అక్షరాస్యత సాధిస్తే, ఇప్పుడు 80 శాతం అక్షరాస్యత సాధించామని, ఇది నిజంగా గొప్ప విజయమని, కానీ, మనం ఇంతటితో సంతృప్తి పడకూడదని అన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి విషయాలను వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. ‘నాడు మా తాతయ్య చెబుతుండేవారు. నా మాతృభాష అయిన తెలుగులో ఆయన చెప్పేవారంటే...‘చదువు రాని మొద్దు - కదలలేని ఎద్దు’ అనే మంచి మాట చెప్పారు. దేశంలో ఇంకా, 18 నుంచి 20 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారంటే, అది మనందరికీ ఓ సవాల్ వంటిదని వెంకయ్యనాయుడు అన్నారు.

More Telugu News