: ట్రంప్ స్వరం ఎందుకు మారింది?... కిమ్ జాంగ్ ఉన్ ను హతమార్చే పథకం రచించిందా?

ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారింది. ఉత్తరకొరియాపై దాడి చేయడమే తమ ముందున్న అంతిమ నిర్ణయం కాదని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ను అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) హతమార్చే పథకం రచించిందని ఉత్తరకొరియా ఆరోపిస్తోంది. అమెరికా శాటిలైట్స్ తో కిమ్ జాంగ్ ఉన్ కదలికలపై కన్నేసిందని ఆ దేశ నిఘా వ్యవస్థ భావిస్తోంది.

 ఈ నేపథ్యంలో కిమ్ జాంగ్ ఉన్ తన అధికారిక ప్యాలెస్ వదిలి బయటకు రావడం లేదని తెలుస్తోంది. ఆ పరిసరాల్లో విమానం, హెలికాప్టర్, డ్రోన్ ఇలా దేని శబ్దం వినిపించినా కిమ్ వణికిపోతున్నట్టు సమాచారం. ఏ క్షణంలో ఎటునుంచి సీఐఏ విరుచుకుపడుతుందో తెలియక ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, అందుకే బయటకు కనబడడం లేదని తెలుస్తోంది. అమెరికా వ్యూహం మారినందునే ట్రంప్ స్వరం మారిందని ఉత్తరకొరియా అధికారులు ఆరోపిస్తున్నారు. లేని పక్షంలో ఉత్తరకొరియాపై నిప్పులు చెరిగే అమెరికా అధ్యక్షుడిలో అంత మార్పు ఎలా సంభవించిందని ఆ దేశం ప్రశ్నిస్తోంది. 

More Telugu News