: గంటకు 4000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్ల డిజైన్ కు నడుం బిగించిన చైనా!

టెస్లా కార్ల కంపెనీ ఓనర్‌ ఎలన్‌ మస్క్‌ ఇటీవల 'హైపర్‌ లూప్‌' పేరుతో గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలిగే రవాణా వ్యవస్థకు నాందిపలికాడు. వెంటనే రంగంలోకి దిగిన చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ టీ-ఫ్లైట్ ను డిజైన్‌ చేసింది. అయస్కాంత క్షేత్రం సాయంతో గాల్లో కొద్దిగా తేలుకుంటూ వెళ్లే మ్యాగ్‌ లెవ్‌ ట్రెన్ల తరహాలో...ఒక గొట్టంలాంటి మార్గంలో ఈ రైళ్లను నడిపిస్తారు. ఈ గొట్టంలో గాలి మొత్తాన్ని తీసేయడం ద్వారా వాటి వేగాన్ని పెంచుతారు. అయస్కాంత క్షేత్రం ఆధారంగా పని చేసే మ్యాగ్ లెవ్ రైళ్లు గరిష్టంగా 400 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలవు...అదే టీ-ఫ్లైట్ అయితే దానికి పది రెట్ల వేగాన్ని అందుకుంటుంది.

దీంతో తొలుత వెయ్యి కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తరువాత దాని వేగం దశలవారీగా పెంచుతామని తెలిపారు. ఇలా గంటకు 4000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వారు తెలిపారు. అయితే ఇంత వేగంతో వెళ్తున్న విషయం అందులో కూర్చున్న వారికి తెలియదని, విమానం టేకాఫ్ తీసుకునే భావం వారికి కలుగుతుందని వారు వెల్లడించారు. అయితే ఈ వేగాన్ని శరీరం ఎక్కువ సేపు భరించలేదని తెలిపారు. చైనా చేపట్టిన ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే భారత్ నుంచి అమెరికా ప్రయాణం కేవలం నాలుగు గంటలు మాత్రమే అవుతుంది. ఇంత వేగంగా ప్రయాణించడం సాధ్యమా? అన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. 

More Telugu News