: బాధాకర అంశాలను సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్న సెలబ్రిటీలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
తమ సినిమా ప్రమోషన్ కోసం బాధాకర అంశాలను కూడా ఈ మధ్య సెలబ్రిటీలు వాడుకుంటున్నారు. తాము చేస్తున్న ట్వీట్లో బాధను వ్యక్తం చేస్తూనే సినిమా ప్రచారాన్ని కూడా కలుపుతుండటంతో వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన పనే ఇవాళ జాన్ అబ్రహం చేశాడు. తన `జెంటిల్మెన్` సినిమా కోసం హర్యానాలో గుర్మీత్ సింగ్ అనుచరులు చేస్తున్న అల్లర్లను సిద్ధార్థ్ ఉపయోగించుకున్నాడు. దీనిపై పలువురు నెటిజన్లు `అల్లర్ల కారణంగా హర్యానా అల్లకల్లోలంగా మారుతుంటే సినిమా చూడమంటావా?` అంటూ మండిపడ్డారు.
అలాగే ఇవాళ జాన్ అబ్రహం కూడా తన `పరమాణు: ద స్టోరీ ఆఫ్ పోఖ్రాన్` సినిమా కోసం ఉత్తర కొరియాలో అణుపరీక్ష వల్ల సంభవించిన భూకంపాన్ని ఉటంకిస్తూ ప్రచారం చేశాడు. దీంతో నెటిజన్లు జాన్ ట్వీట్ను వివిధ రకాలుగా అన్వయిస్తూ జోకులు సృష్టించారు. ప్రతి చిన్న విషయాన్ని జాన్ సినిమాలకు జోడిస్తూ కామెంట్లు చేశారు. దీంతో జాన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసి భూకంపం గురించి మాత్రమే వేరే ట్వీట్ చేశాడు.