: జమ్ముకశ్మీర్ లో జిహాద్ పోరాటాన్ని మరింత బలపరచండి: ఉగ్రవాదులకు అబ్దుల్ రెహ్మాన్ మ‌క్కీ పిలుపు

భార‌త్‌లోని జ‌మ్ముక‌శ్మీర్‌లో త‌మ జిహాద్ పోరాటాన్ని మ‌రింత బ‌ల‌ప‌ర్చాల‌ని ఉగ్ర‌వాద సంస్థ‌ జ‌మాత్ ఉద్ ద‌వా (జేయూడీ) చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మ‌క్కీ పిలుపునిచ్చాడు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని బందిపొరాలో ఈ ఏడాది మార్చి 3న భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు హ‌త‌మార్చిన అబూ వ‌లీద్ మ‌హ‌మ్మ‌ద్ కు నివాళిగా పాకిస్థాన్‌ లాహోర్‌లోని ఆల్ ద‌వా మోడ‌ల్ స్కూల్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో రెహ్మాన్ మ‌క్కీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉగ్ర‌వాది అబూ వ‌లీద్‌ మ‌హమ్మ‌ద్ ని ప్ర‌శంసించాడు.

అబూ వ‌లీద్ ప్రాణత్యాగం కొన్ని వేల మంది త‌మ‌ జేయూడీ కార్య‌క‌ర్త‌ల‌కు స్ఫూర్తిగా నిలిచింద‌ని చెప్పాడు.  హిందూ బ‌ల‌గాల నుంచి జ‌మ్ముక‌శ్మీర్‌కి ముక్తి క‌లిగించాల‌ని అన్నాడు. భార‌త ప్ర‌భుత్వం కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రించి, అంత‌ర్జాతీయ స‌మాజం త‌మ నాయ‌కుడు హ‌ఫీజ్ స‌యీద్ ను ఉగ్ర‌వాదిగా గుర్తించేలా చేసింద‌ని, ఆయనను హౌస్ అరెస్ట్ చేయించేలా చేసింద‌ని మండిప‌డ్డాడు. భార‌త్‌తో పాకిస్థాన్ స‌త్సంబంధాలు కొన‌సాగించ‌కూడ‌ద‌ని ఆయ‌న అన్నాడు. అలాగే, జిహాద్‌ను అనుస‌రించ‌కుండా కొంద‌రిని అడ్డుకున్న న‌వాజ్ ష‌రీఫ్‌కి అల్లా శిక్ష విధించాడ‌ని పేర్కొన్నారు.

More Telugu News