: రేపు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. 8మంది ఔట్.. ఏపీ నుంచి హరిబాబుకు చోటు?

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే శనివారమే కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందులో భాగంగా ఎన్డీయేలోకి ఇటీవల వచ్చి చేరిన జేడీయూకు కేబినెట్‌లో స్థానం కల్పించనుండగా, అన్నాడీఎంకే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక ప్రస్తుత మంత్రుల్లో 8 మందిపై కత్తివేలాడుతుండగా, మరో 8 మంది శాఖలు మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, సంజీవ్ బల్యాన్, ఉమాభారతి, ఫగన్ సింగ్ కులస్తే, గిరిరాజ్ సింగ్ రాజీనామా చేయగా వీరిలో రాజీవ్ రూడీ,  సంజీవ్ బల్యాన్ రాజీనామాలను ఆమోదించారు. ఉమాభారతి అనారోగ్య కారణాలతో రాజీనామా సమర్పించారు.

ఇక పదవి కోల్పోనున్న వారిలో నిర్మలా సీతారామన్, కల్రాజ్ మిశ్రా ఉన్నట్టు తెలుస్తోంది. నితిన్ గడ్కరీకి రైల్వే శాఖ అప్పగించనున్నట్టు తెలుస్తుండగా, సీతారామన్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పౌర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజు శాఖ మారిపోనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్థిక, రక్షణ శాఖల బాధ్యతలు మోస్తున్న అరుణ్ జైట్లీకి రక్షణ శాఖను పూర్తిస్థాయిలో అప్పగించి ఆర్థిక శాఖను పీయూష్‌కు అప్పగించే యోచనలో ఉన్నారు. ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబుకు కేబినెట్‌లో చోటు ఖాయంగా కనిపిస్తోంది.

More Telugu News