: బ్రిక్స్ లో కొత్త దేశాలను కలపాలని ప్రయత్నించిన చైనా.. అడ్డుకున్న భారత్!

చైనాలో వ‌చ్చేనెల 3వ తేదీ నుంచి ప్రారంభ‌మ‌య్యే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూట‌మి స‌మావేశం నేప‌థ్యంలో, కొత్త దేశాలకు బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం కల్పించాల‌ని చైనా యోచించింది. త‌ద్వారా బ్రిక్స్ ప్లస్ కూటమిగా దాన్ని మార్చాల‌ని అనుకుంది. అయితే, చైనా అస‌లు ఉద్దేశాన్ని ప‌సిగ‌ట్టిన భార‌త్ అందుకు అడ్డు త‌గిలింది. ఆ కూటమిలో తనకు సన్నిహితమైన దేశాలకు సభ్యత్వం ఇవ్వాలనేదే చైనా ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని, దీంతో తన ప్రాబల్యాన్ని మరింతగా పెంచుకోవాలని చైనా యోచిస్తోంద‌ని భార‌త్‌తో పాటు మిగ‌తా మూడు దేశాలు కూడా గ్ర‌హించాయి.

దీంతో చైనా త‌మ ఆలోచ‌న‌పై వెన‌క్కు త‌గ్గింది. బ్రిక్స్ లో కొత్త దేశాల‌ను క‌ల‌పాల‌న్న త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ట్లు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి మీడియాకు చెప్పారు. కొత్త దేశాల‌ను క‌ల‌ప‌డం ద్వారా ప‌శ్చిమ దేశాల ఆధిపత్యాన్ని మరింత దీటుగా ఎదుర్కోవచ్చ‌నేదే త‌మ ఉద్దేశ‌మ‌ని చైనా చెప్పుకొచ్చింది. చైనాలోని జియామెన్‌లో జ‌ర‌గ‌నున్న‌ బ్రిక్స్ సదస్సుకు చైనా ఇప్ప‌టికే బ్రిక్స్ కూటమికి చెందని థాయ్‌లాండ్, ఈజిప్ట్, తజికిస్థాన్, మెక్సికో, గినియాలకు ఆహ్వానం పంపింది. ఆయా దేశాల్లో చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టు చేప‌ట్టింది. చైనా ఆలోచనను గ్రహించిన భారత్ ఆయా దేశాలను బ్రిక్స్ లో చేర్చడానికి ఒప్పుకోలేదు. 

More Telugu News