mahesh babu: మహేశ్ కోసం భారీ స్థాయిలో అసెంబ్లీ సెట్ రెడీ!

'శ్రీమంతుడు'మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మరో సినిమా చేయడానికి మహేశ్ బాబు ఎంతో ఆసక్తిని చూపించాడు. ఫలితంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో 'భరత్ అను నేను' సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో మహేశ్ బాబు రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. అందువలన ఆయన కాంబినేషన్లోని అసెంబ్లీ సీన్స్ కూడా ఈ సినిమాలో వున్నాయి.

ఈ సినిమాలో శాసనసభ సన్నివేశాల కోసం అసెంబ్లీ భవనం సెట్ వేయిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ సెట్ నిర్మాణం పూర్తయిందనేది తాజా సమాచారం. 'స్పైడర్'లో బ్యాలెన్స్ వున్న పాట షూటింగ్ కోసం 'రొమేనియా' వెళ్లిన మహేశ్ తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయన రాగానే ఈ సెట్లో షూటింగ్ మొదలవుతుంది. దాదాపు నెల రోజులకు పైగా షూటింగ్ ఈ సెట్లో కొనసాగుతుంది. గతంలో మహేశ్ చేసిన 'ఒక్కడు' సినిమా కోసం 'చార్మినార్' సెట్ వేశారు. 'అర్జున్' సినిమా కోసం 'మధుర మీనాక్షి టెంపుల్' సెట్ వేశారు. ఆ తరువాత ఆయన మూవీ కోసం వేసిన అంతటి భారీ సెట్ ఇదేనని అంటున్నారు.

More Telugu News