: శస్త్రచికిత్స చేస్తూ కొట్లాటకు దిగిన డాక్టర్లు... బిడ్డ మృతి!

ఓ గర్భవతికి సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్న వేళ, ఇద్దరు డాక్టర్లు కొట్లాటకు దిగగా, వారు చూపిన నిర్లక్ష్యం ఓ చిరు ప్రాణాన్ని బలిగొంది. జోధ్ పూర్ లోని అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న ఉమైద్ హాస్పిటల్ లో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ మహిళ ప్రసవం నిమిత్తం ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఆపరేషన్ నిర్వహించాల్సిన డాక్టర్లు అశోక్ నానివాల్, ఎంఎల్ తిక్ ల మధ్య వివాదం తలెత్తింది. ఆపరేషన్ కు ముందు ఆమె ఏదైనా ఆహారం తీసుకున్నదా? అని నానివాల్ వేసిన ప్రశ్నతో గొడవ మొదలైంది.

 డాక్టర్లు ఇద్దరూ నువ్వెంత? అంటే నువ్వెంత? అనుకున్నారు. రాయలేని విధంగా తిట్టుకున్నారు. హద్దులు దాటుతున్నారని హెచ్చరించుకున్నారు. పురిటి నొప్పులు పడుతున్న మహిళను వదిలేసి గొడవ పెట్టుకున్నారు. దీంతో శస్త్రచికిత్స ఆలస్యం కాగా, బిడ్డ మరణించింది. మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మొత్తం ఘటనను ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్న ఓ నర్సు తన మొబైల్ లో చిత్రీకరించగా, ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు నానివాల్, ఎంఎల్ తక్ లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

More Telugu News