: సీనియర్‌లు ఇబ్బందులు పెడుతున్నారని... హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య

తన సీనియ‌ర్లు ఇబ్బందులు పెడుతున్నార‌ని ఓ విద్యార్థిని హాస్ట‌ల్‌లో ఉరి వేసుకుని ఆత్మ‌హత్య చేసుకున్న ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్‌ గ్రామ పంచాయతీ రత్నపురి వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో క‌ల‌క‌లం రేపింది. మృతురాలు నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి గ్రామానికి చెందిన 17 ఏళ్ల స‌హ‌స్ర అని పోలీసులు తెలిపారు. త‌న‌ను త‌న సీనియ‌ర్లు ఇబ్బంది పెడుతున్నార‌ని ఆమె త‌న తండ్రి రాజశేఖర్‌కు చెప్పగా.. ఆయ‌న రెండు వారాల క్రితం ఆ కాలేజీకి వ‌చ్చి ఏఓ భిక్షపతితో మాట్లాడారు.

అయిన‌ప్ప‌టికీ ఆ అమ్మాయి ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉంది. దీంతో సహస్ర నిన్న అర్ధ‌రాత్రి ఆత్మ‌హ‌త్య లేఖ‌ను రాసి, తన గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. త‌న‌కు ఆ కాలేజీ నచ్చడం లేదని, తాను కష్టాల్లో ఉన్నప్పుడు సాయ‌ప‌డే స్నేహితులు లేరని పేర్కొంది. ఒక‌వేళ ఆ కాలేజీ నుంచి బయటకు వెళ్తామంటే త‌న కుటుంబంలో ఇబ్బందులని అందులో రాసింది. త‌న‌ను క్షమించాల‌ని, త‌న‌ తమ్ముడిని మాత్రం హాస్టల్‌లో వేయకండ‌ని పేర్కొంది. కాలేజీ యాజమాన్యం, ఏఓ భిక్షపతి వేధింపుల కార‌ణంగానే త‌న కుమార్తె ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింద‌ని రాజ‌శేఖ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు.   

More Telugu News