: గణేశ పూజకు రెడీ.. షూటింగ్ ఆపుకుని అబుదాబి నుంచి వచ్చిన సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కుటుంబం ప్రతి ఏటా వినాయకచవితి పండగను జరుపుకోవడం ఆనవాయతీ. ఈ ఏడాది కూడా గణేశ్ చతుర్థిని వైభవంగా జరుపుకునేందుకు సల్మాన్ కుటుంబం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘టైగర్ జిందా హై’ చిత్రం షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్న సల్మాన్, అబుదాబి నుంచి నిన్న రాత్రే ముంబయికి చేరుకున్నాడు. ‘గణేశ్ జీ’  శక్తిపై తమ కుటుంబానికి అపారమైన విశ్వాసం ఉందని సల్మాన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సల్మాన్ తల్లి మహారాష్ట్ర, రాజ్ పుత్ డోగ్రా సంప్రదాయాలకు చెందిన వ్యక్తి కావడంతో గణేశ్ చతుర్థి సల్మాన్ కు కుటుంబ పండగ అయింది.

ఇక వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేశుడి ప్రతిమకు మూడు రోజుల పాటు సల్మాన్ కుటుంబం పూజలు చేస్తుండటం ఆనవాయతీ. కాగా, ఈ ఏడాది వినాయక చవితి వేడుకలను సల్మాన్ ముంబయిలోని తన గెలాక్సీ అపార్ట్ మెంట్స్ లో నిర్వహించకపోవచ్చని ఓ ఆంగ్లపత్రిక కథనం. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ నివసించే బాంద్రాలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవల విడుదలైన సల్మాన్ ‘ట్యూబ్ లైట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని నేపథ్యంలో బోల్తా కొట్టింది. ఈ తరుణంలో సల్మాన్ కు గణేశుడి ఆశీస్సులు ఎంతైనా అవసరమని, ఆయన తదుపరి చిత్రం ‘టైగర్ జిందా హై’ మంచి విజయం సాధించేందుకు కండలవీరుడు సల్మాన్ ప్రణమిల్లక తప్పదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News