: తెలుగు రాష్ట్రాలను దంచి కొడుతున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాలను వర్షాలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండగా, వాటికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మబ్బులు కమ్మేయగా, పలు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. నేడు, రేపు అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా తెలంగాణలో వానలు అధికంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ ఒడిశా వరకూ అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాల వరకూ భారీ వర్షాలను కళ్లజూడనున్నాయని తెలిపారు.

కాగా, ఇప్పటికే రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి తెల్లారే వరకూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను చిరు జల్లులు పలకరిస్తూనే ఉన్నాయి. తెలంగాణలోని వరంగల్, జయశంకర్, యాదాద్రి, కరీంనగర్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. నంద్యాలలో కురిసిన భారీ వర్షం రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారానికి అడ్డంకులు కల్పించింది. ఇక విస్తారంగా వర్షాలు పడుతూ ఉండటంతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వానలతో అన్ని రకాల పంటలకూ మేలేనని రైతులు అంటున్నారు.

More Telugu News