: యొ-యొ పరీక్షలో ఫెయిలైన యువరాజ్, రైనా.. వన్డే జట్టుకు ఎంపిక కాకపోవడానికి ఇదే కారణం!

యొ-యొ పరీక్ష ఏంటి అనుకుంటున్నారా? టీమిండియా ఆటగాళ్ల ఫిట్ నెస్ ను నిర్ధారించే కొత్త తరహా పరీక్షే ఈ యొ-యొ. శ్రీలంక వన్డే సిరీస్ కు యువరాజ్, రైనాలు ఎంపిక కాకపోవడానికి ఈ పరీక్షే కారణం. ఈ పరీక్షలో యువీ, రైనాలు ఫెయిల్ అయ్యారు. ఈ పరీక్షలో 19.5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవారే ఫిట్ నెస్ తో ఉన్నట్టు లెక్క.

యొ-యొ పరీక్షలో యువీ కేవలం 16 పాయింట్లకే పరిమితం అయ్యాడు. దీంతోనే అతనిపై వేటు పడిందని చెబుతున్నారు. మరోవైపు సురేష్ రైనా కూడా 16 పాయింట్లే తెచ్చుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ, జడేజా, మనీష్ పాండేలు మాత్రం 21 కంటే ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్నారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ లు ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో... ఈ పరీక్షలో ఆటగాళ్లు సాధించే ఫలితాలు కీలకంగా మారాయి.

1990లలో ఫిట్ నెస్ టెస్ట్ కోసం బీప్ పరీక్ష నిర్వహించేవారు. అప్పట్లో అజార్, రాబిన్ సింగ్, అజయ్ జడేజాలు మాత్రమే పరీక్షలో అర్హత సాధించేవారు. మిగిలినవారెవ్వరూ 16-16.5 పాయింట్లు దాటేవారు కాదు. ప్రస్తుతం జట్టు కెప్టెనే 21 పాయింట్లు సాధిస్తుండటంతో... అదే ప్రామాణికంగా మారిందని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపారు. 

More Telugu News