: వీరేంద్ర సెహ్వాగ్ పై మండిపడుతున్న నెటిజన్లు

టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని గోరఖ్‌పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వారం రోజుల వ్య‌వ‌ధిలో సుమారు 65 మంది చిన్నారులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీనిపై సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ అమాయకుల ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడుతున్నానని అన్నాడు. 1978లో మెదడువాపు వ్యాధి తొలిసారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 50 వేల మందికిపైగా చిన్నారులు మృత్యువాత ప‌డ్డారని, అదే సంవత్సరం అంటే 1978లోనే తాను జన్మించానని పేర్కొన్నాడు.

అయితే, ఆ ఆసుప‌త్రిలో పిల్ల‌ల మృతికి కార‌ణం వారికి వ‌చ్చిన వ్యాధే అనేలా ఆయ‌న ట్వీట్ ఉంద‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ అందక పిల్ల‌లు చ‌నిపోయార‌న్న కారణాన్ని ఎత్తి చూపడంలో సెహ్వాగ్ వెనుకంజ వేశార‌ని మండిప‌డుతున్నారు. ప్ర‌భుత్వాన్ని సెహ్వాగ్ ఎందుకు విమ‌ర్శించడం లేదని వారు దుయ్య‌బ‌ట్టారు.  

More Telugu News