: ఇజ్రాయెల్ లో తొలి దాడి చేసిన ఐసిస్

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో అరాచకాలకు పాల్పడుతున్న ఉగ్ర సంస్థ ఐసిస్... తాజాగా ఇజ్రాయెల్ పై తొలిసారి పంజా విసిరింది. రాజధాని జెరూసలెంలోని ఓల్డ్ సిటీ శివారులో ఓ మహిళా పోలీసు అధికారిని ముగ్గురు ముష్కరులు కత్తితో పొడిచి చంపారు. అనంతరం వీరు ముగ్గురినీ పోలీసులు మట్టుబెట్టారు. ఈ దాడి తామే చేశామని ఐసిస్ ఆన్ లైన్ లో ప్రకటించుకుంది. యూదులను లక్ష్యంగా చేసుకునే ఈ దాడి చేశామని... మునుముందు చాలా దాడులు జరుగుతాయని హెచ్చరించింది.

నిన్న రాత్రి జెరూసలెంలోని అల్ అఖ్సా మసీదు సమీపంలో ఈ దాడి జరిగింది. ముష్కరుల్లో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపగా, మూడో వ్యక్తి కత్తితో మహిళా పోలీసు అధికారిని పొడిచాడు. అయితే, ఈ దాడి చేసింది ఐసిస్ ఉగ్రవాదులు కాదని... స్థానిక తిరుగుబాటుదారులే కాల్పులకు పాల్పడ్డారని పాలస్తీనాకు చెందిన సున్నీ-ఇస్లామిక్ ఆర్గనైజేషన్ హహాస్ తెలిపింది.

More Telugu News