: లండన్ ఎయిర్ పోర్టులో పాక్ విమాన సిబ్బందికి షాక్.. ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్

పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన సిబ్బందికి లండన్ ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఇస్లామాబాద్ నుంచి బయల్దేరిన విమానం నిన్న తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రయాణికులు దిగిపోగానే... ఎయిర్ పోర్ట్ అధికారులు విమాన సిబ్బందిని తమ అధీనంలోకి తీసుకున్నారు. విమానం మొత్తాన్ని దాదాపు రెండు గంటల పాటు తనిఖీ చేశారు. అనంతరం ఆ విమానానికి క్లియరెన్స్ ఇచ్చారు. రక్షణ చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించామని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పాకిస్థాన్ కొంచెం సీరియస్ అయింది. అకారణంగా తమ సిబ్బందిని అదుపులోకి తీసుకొని, తనిఖీలు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై బ్రిటీష్ ఏవియేషన్ అథారిటీకి ఫిర్యాదు చేస్తామని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అధికారిక ప్రతినిధి మషూద్ తజ్వార్ తెలిపారు.  

More Telugu News