: బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్.. పోస్టుపెయిడ్ వినియోగదారులకు మాత్రమే!

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) పోస్టు పెయిడ్ వినియోగదారుల కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. నెలకు కేవలం రూ.599తో అన్ని లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు 6జీబీ డేటాను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు. నాలుగు నెలలపాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అనంతరం ఇదే ఆఫర్ ఆ తర్వాత రూ.799 గా మారిపోతుంది. ఉచిత కాల్స్‌తోపాటు 3 జీబీ డేటా వస్తుందని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు.

మరోవైపు విదేశాల్లో వైఫై హాట్‌స్పాట్ సేవలు అందించేందుకు టాటా కమ్యూనికేషన్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకున్న బీఎస్ఎన్ఎల్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, లండన్, చైనా, రష్యాల్లోని ప్రధాన నగరాల్లో హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా రూ.999కే వారం రోజులపాటు అన్‌లిమిటెడ్ డేటా, రూ.1599తో 15 రోజులు, రూ.1999తో నెల రోజులపాటు వైఫై హాట్‌స్పాట్ సేవలు పొందవచ్చు. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో నేడు(గురువారం) నిర్వహించే మెగా మేళాలో సిమ్‌కార్డులను ఉచితంగా పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. కస్టమర్ సర్వీస్ సెంటర్లతోపాటు బీఎస్ఎన్ఎల్ సిబ్బంది నిర్వహించే రోడ్‌షోలలో ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

More Telugu News