: టాటా గ్రూప్ చైర్మన్ గా సుబ్రమణియన్ రామదొరై?

టాటా గ్రూప చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికినప్పటి నుంచి ఆ పదవిలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఎస్ డీఏ), నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ డీసీ) చైర్మన్ పదవులకు రాజీనామా చేసిన సుబ్రమణియన్ రామదొరై పేరు ప్రముఖంగా వినపడుతోంది. అనారోగ్య కారణాల వల్ల తన పదవులకు రాజీనామా చేసిన రామదొరై వయసు 71 సంవత్సరాలు. రాజీనామా గురించి ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన ఆ లేఖలో తన అనారోగ్యం గురించి ఆయన ప్రస్తావించారు. కాగా, సుబ్రమణియన్ రాజీనామా నేపథ్యంలో వ్యాపార వర్గాల్లో ఒక వార్త బాగా ప్రచారం జరుగుతోంది. ‘టాటా గ్రూప్’తో ఎంతో అనుబంధం ఉన్న రామదొరైని చైర్మన్ పదవి వరించనుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. కాగా, గతంలో టాటా కన్సల్టెన్సీ మాజీ వైస్ చైర్మన్ గా పనిచేసిన రామదొరై, 2013 మేలో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలకు చైర్మన్ గా నియమితులయ్యారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్,ఎయిర్ ఏషియా సంస్థలకు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, రామదొరై రాజీనామా చేయడంతో, ఎన్ఎస్ డీఏ, ఎన్ఎస్ డీసీ వైస్ చైర్మన్ గా ఉన్న రోహిత్ నందన్ తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

More Telugu News