: 'చేసిన సేవకు థ్యాంక్స్' అంటూ ఇండియాలో ఉద్యోగులకు 'పింక్ స్లిప్'లు ఇస్తున్న ట్విట్టర్

ఇండియాలో డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను నిలిపివేయాలని నిర్ణయించుకున్న మైక్రో బ్లాగింగ్ సైట్, బెంగళూరులో నిర్వహిస్తున్న సెంటర్ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. బెంగళూరులోని సెంటర్ లో ఇంజనీరింగ్ కార్యక్రమాలను ఆపివేశామని, తమకు ఇంతకాలం అండగా నిలిచిన ఉద్యోగులకు కృతజ్ఞతలని చెప్పిన ట్విట్టర్, వారిని గౌరవప్రదంగా కంపెనీ నుంచి పంపే ప్రయత్నాలు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇండియా తమ సంస్థకు ఎంతో మంచి మార్కెట్ అని, ట్విట్టర్ కస్టమర్లు, భాగస్వాములు తమకు ముఖ్యమని వెల్లడించింది. కాగా, ఇప్పటికే పలువురు ఉద్యోగుల తొలగింపు తేదీని తెలుపుతూ 'పింక్ స్లిప్'లను ఇచ్చిన ట్విట్టర్, మొత్తం ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నామన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక ఆదాయాభివృద్ధి లక్ష్యంగా ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ట్విట్టర్ ప్రకటించింది. ఫేస్ బుక్ వంటి సంస్థల నుంచి తీవ్రమైన పోటీ రావడంతో ఇటీవలి కాలంలో ట్విట్టర్ ఆదాయం, నికర లాభం దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు జరుగుతున్నట్టు సమాచారం.

More Telugu News