: బక్రీద్ పండగ నాడు వెలవెలబోయిన కాశ్మీర్

బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం చోటుచేసుకున్న అల్లర్లు చల్లారకపోవడంతో గత రెండు నెలలుగా కాశ్మీర్ లో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో బక్రీద్ ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. కాశ్మీర్ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కాశ్మీర్ వ్యాప్తంగా డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ముస్లింలకు పవిత్ర పండుగైన బక్రీద్ రోజు కూడా కాశ్మీర్ లో ఎలాంటి మార్పు చోటుచేసుకోకపోవడం విశేషం. ప్రముఖ హజ్రత్ బల్ మసీదు వద్ద ఈద్ ప్రార్థనలు నిలిపేశారు. స్థానికులందర్నీ దగ్గర్లోని మసీదుల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో కాశ్మీర్ లో ఒకరకమైన స్తబ్ధత ఏర్పడింది. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. దీంతో గత 70 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి చూళ్లేదని ఓ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు.

More Telugu News