: యూఎస్ ఓపెన్ లో సంచలనం!... అనామకురాలి చేతిలో ఓడిన సెరెనా!

యూఎప్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే మట్టి కోర్టు రారాజుగా పేరుగాంచిన టెన్నిస్ సంచలనం నాదల్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక ఈ దఫా టైటిల్ నెగ్గి అత్యధిక గ్రాండ్ స్లామ్ టోర్నీలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు పుటలకెక్కుతుందని భావిస్తున్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టైటిల్ పోరుకు కూడా అర్హత సాధించలేకపోయింది. నల్లకలువగా పేరొందిన సెరెనా... ఈ టోర్నీ ద్వారానే అత్యధిక గ్రాండ్ స్లామ్ మ్యాచ్ లు గెలిచిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు. నిన్నటిదాకా రోజర్ ఫెదరర్ పేరు మీదున్న సదరు రికార్డును రెండు రోజుల క్రితం సెరెనా బద్దలు కొట్టేసింది. ఈ క్రమంలో ఈ దఫా మహిళల సింగిల్స్ టైటిల్ సెరెనాదేనన్న వాదన వినిపించింది. అయితే భారత కాలమానం ప్రకారం కొద్దిసేపటి క్రితం ముగిసిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన అనామకురాలు ప్లిస్కోవా చేతిలో సెరెనా ఓడింది. ఫోర్ హ్యాండ్ షాట్లలో సత్తా కలిగిన క్రీడాకారిణిగా పేరున్న సెరెనాను వరుస సెట్లలోనే 2-6, 6-7 స్కోరు తేడాతో ప్లిస్కోవా చిత్తు చేసింది. ప్లిస్కోవా దెబ్బకు తాళలేక సెరెనా మ్యాచ్ ను జారవిడుచుకోవడంతో పాటు యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది.

More Telugu News