: ఐదు గంటలుగా భూమన విచారణ... బయట పడిగాపులు గాస్తున్న ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణ స్వామి

గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని అధికారులు ఐదు గంటలుగా విచారిస్తున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఆయనతో పాటు సీఐడీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామిలు ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎండగడుతుందన్న ఉద్దేశంతోనే, వారి దృష్టిని మరల్చడానికి భూమనను అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. కేవలం అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ను ఎదుర్కొనేందుకు భూమనను బూచిగా చూపి గట్టెక్కాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని, ఎందుకంటే సీఐడీ కార్యాలయం ఎదుట భారీగా మఫ్టీలో పోలీసులను మోహరించారని ఆయన తెలిపారు. భూమనను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. భూమన అరెస్టు వార్తలు వెలువడుతుండడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.

More Telugu News