: దశాబ్ద కాలంలో తొలిసారి.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కనిపించని ముస్లిం న్యాయమూర్తి

దేశ అత్యున్నత న్యాయస్థానంలో 11 ఏళ్ల తర్వాత తొలిసారి ముస్లిం జడ్జి ప్రాతినిధ్యం కనిపించడం లేదు. సుప్రీంకోర్టులో ఉన్న ఇద్దరు ముస్లిం జడ్డిలు ఈ ఏడాది రిటైర్ అయ్యారు. దీంతో దశాబ్ద కాలంలో తొలిసారి ముస్లిం జడ్జి లేని లోటు కనిపిస్తోంది. ఇలా ముస్లిం జడ్జి లేకుండా వుండడం మూడు దశాబ్దాల కాలంలో ఇది రెండోసారి. 2012లో ఎంవై ఇక్బాల్, జస్టిస్ ఫకీర్ మొహమ్మద్ ఇబ్రహిం ఖలీఫుల్లాలను సుప్రీంకోర్టు నియమించింది. ఇక్బాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన, ఖలీఫుల్లా జూలై 22న రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు, కేంద్రం మధ్య జడ్జిల నియామకం విషయంలో వివాదం నెలకొనడంతో ముస్లిం జడ్జి నియామకానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక ప్రస్తుతం బీహార్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల హైకోర్టుల్లో ముస్లిం జడ్జిలు కొనసాగుతున్నారు. అసోంకు చెందిన ఇక్బాల్ అహ్మద్ బీహార్ చీఫ్ జస్టిస్‌గా కొనసాగుతుండగా, జమ్ముకశ్మీర్‌కు చెందిన మన్సూర్ అహ్మద్ మిర్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా కొనసాగుతున్నారు. ఇక్బాల్ వచ్చే అక్టోబరులో రిటైర్ కానుండగా, మన్సూర్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు.

More Telugu News