: కోమటిరెడ్డిని కోర్టుకు లాగిన భూపాల్ రెడ్డి!... విద్యార్హతల కేసులో హైకోర్టుకు నల్లగొండ ఎమ్మెల్యే!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మొన్న, నిన్న హైకోర్టులో జరిగిన ఓ విచారణకు స్వయంగా హాజరు కావాల్సి వచ్చింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా నల్లగొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కోమటిరెడ్డి... టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిని ఓడించారు. అయితే సదరు ఎన్నికల్లో కోమటిరెడ్డి తాను బీఈ చదివినట్లు అఫిడవిట్ లో తప్పుడు విద్యార్హతలను పేర్కొన్నారని భూపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అఫిడవిట్ లో తప్పుడు విద్యార్హతలు పేర్కొన్న కోమటిరెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని భూపాల్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో భూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై మొన్న, నిన్న హైకోర్టులో రెండు రోజుల పాటు విచారణ జరిగింది. ఈ విచారణకు కోమటిరెడ్డి కూడా స్వయంగా హాజరుకాక తప్పలేదు. అఫిడవిట్ లో తానెక్కడా బీఈ పాసైనట్లు పేర్కొనలేదని ఈ సందర్భంగా కోమటిరెడ్డి కోర్టుకు విన్నవించారు. అయితే కోమటిరెడ్డికి బీఈ విద్యార్హత ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన ఓ లెటర్ హెడ్ ను పరిశీలించిన తర్వాత తీర్పు వెలువరించనున్నట్లు చెప్పిన ధర్మాసనం కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

More Telugu News