: నయీమ్ విషయంలో కిరణ్, రోశయ్య లకు ఏం లొసుగులున్నాయో మరి!: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

2009 నుంచి నయీమ్ అరాచకాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ ఎం.ఎల్.సి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, నయీమ్ తో చాలా మంది రాజకీయ నాయకులకు లింకులున్నాయని వార్తా కథనాలు వెలువడుతున్నాయని అన్నారు. గుండాలతో స్నేహం చేసిన రాజకీయ నాయకుల గురించి ప్రజలకు తెలియాలని, తక్షణం వారి పేర్లు వెల్లడించి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నయీమ్ ను ఎన్ కౌంటర్ చేసి ప్రభుత్వం మంచి పని చేసిందని ఆయన చెప్పారు. 2009లో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలకు నయీమ్ తో ఏం లొసుగులు ఉండి అతనిని ఉపేక్షించారో తనకు తెలియదని ఆయన చెప్పారు. నయీమ్ కారణంగా నిరుపేదలు నష్టపోయారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ నేతలను రక్షించే ప్రయత్నంలో కేసును నీరుగార్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసును సీబీఐకి అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన సవాలు విసిరారు.

More Telugu News