: బీజేపీ నేతపై దుండగుల బుల్లెట్ల వర్షం... వంద రౌండ్ల కాల్పులు..పరిస్థితి విషమం

బీజేపీ సీనియర్ నేత, కిసాన్ మోర్చా సభ్యుడు బ్రిజ్‌పాల్ టియోటియా(49) కాన్వాయ్‌పై ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో గుర్తు తెలియని దుండగులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఏకంగా వందరౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో బ్రిజ్‌పాల్‌తోపాటు మరో ఐదుగురు గన్‌మెన్లు గాయపడ్డారు. వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బ్రిజేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. టయోటా కారులో వచ్చిన దుండగులు బ్రిజ్‌పాల్ ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపి పరారైనట్టు పోలీసులు తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఏకే-47, రెండు 9 ఎంఎం పిస్టళ్లు, ఓ రైఫిల్‌ను సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దుండగులు వందరౌండ్లు కాల్చినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని భావిస్తున్నట్టు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. బ్రిజ్‌పాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు కేంద్రమంత్రి మహేశ్ శర్మ పేర్కొన్నారు. బ్రిజ్‌పాల్ 2012లో ఉత్తరప్రదేశ్‌లోని మురద్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గురువారం ఢిల్లీ నుంచి ఘజియాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

More Telugu News