: భద్రతాదళాల 'ఆపరేషన్' ప్రత్యక్ష ప్రసారాలపై మండిపడ్డ బంగ్లాదేశ్ ప్రధాని

ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు చేపట్టిన భద్రతాదళాల ఆపరేషన్ ని బంగ్లాదేశ్ టీవీ ఛానెళ్లు ప్రత్యక్షప్రసారం చేయడంపై ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. ఢాకాలో హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్ లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని దారుణంగా హతమార్చిన విషయ తెలిసిందే. ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చేందుకు భద్రతాబలగాలు సుమారు పది గంటలపాటు కష్టపడ్డాయి. ఈ దృశ్యాలను బంగ్లాదేశ్ లోని ప్రముఖ టీవీ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అమెరికాలో ఈ తరహా దాడులు జరిగినప్పుడు సీఎన్ఎన్ లేదా బీబీసీ వంటి సంస్థలు ఇలాంటి వాటిని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయా? అని ఆమె ప్రశ్నించారు. బంగ్లాదేశ్ టీవీ ఛానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శించాయని అన్నారు. టీవీ ఛానెళ్లకు లైసెన్స్ లు ఇచ్చింది ప్రభుత్వమేనని, రద్దు చేసే అధికారం కూడా ఉందంటూ ఆమె మండిపడ్డారు. ఈ తరహా వ్యవహారాల్లో టీవీ ఛానెళ్లు సంయమనం పాటించాలని సంబంధిత యజమానులను కోరుతున్నానని హసీనా అన్నారు.

More Telugu News