: వారెన్ బఫెట్ తో లంచ్ కోసం 3.4 మిలియన్ డాలర్లు వెచ్చిస్తున్న అజ్ఞాత వ్యక్తి

షేర్ మార్కెట్ రారాజు వారెన్ బఫెట్ తో కలిసి భోజనం చేసేందుకు ఓ అజ్ఞాత వ్యక్తి ఏకంగా 3.4 మిలియన్ డాలర్లను వెచ్చించేందుకు సిద్ధపడ్డాడు. బఫెట్ తో కలిసి సింగిల్ టైం భోజనం చేసేందుకు ఇంత పెద్ద మొత్తమా? అంటే... అవుననే అంటోంది ప్రముఖ ఆన్ లైన్ వేలం సంస్థ ‘ఈబే’. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ సంస్థ...గూడులేని వారికి అండగా నిలుస్తోంది. ఈ సంస్థకు బాసటగా నిలిచేందుకు వారెన్ బఫెట్ ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా తనతో కలిసి భోజనం చేసే అవకాశం మీదేనంటూ ఆయన ఈబేలో వేలం పెట్టారు. గత ఆదివారం మొదలైన ఈ వేలం నిన్నటితో ముగిసింది. వేలంలో బఫెట్ లో లంచ్ కోసం 3,456,789 డాలర్లను ఖర్చు పెట్టేందుకు సిద్ధమంటూ ఓ వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బఫెట్ తో లంచ్ కు పోటీలు పడ్డ మిగిలిన వారంతా 2 మిలియన్ డాలర్ల వరకు వేలంలో పాల్గొన్నా... అజ్ఞాత వ్యక్తి భారీ ఆఫర్ తో వెనక్కు తగ్గారు. వేలం వివరాల మేరకు న్యూయార్క్ నగరంలోని స్మిత్ అండ్ వొలెన్ స్కై స్ట్రీట్ హౌస్ లో విందారగించాల్సి ఉంది. అయితే తన వివరాలు ప్రపంచానికి తెలియజేయవద్దంటూ ఆ అజ్ఞాత వ్యక్తి కోరడంతో లంచ్ ఎక్కడ జరుగుతుందన్న విషయం తెలియరాలేదు.

More Telugu News