: మంచి నీళ్ల కోసం మానప్రాణాలను పణంగా పెట్టాలి... ఆఫ్రికా మహిళల దుస్థితి!

మంచి నీళ్లు కావాలంటే మానం గురించి ఆలోచించకూడదు, ప్రాణాన్ని అసలే లెక్క చేయకూడదు. ఈ రెండింటి గురించి ఆలోచించకుండా బిందెలతో నీటి వేటకు బయలుదేరితేనే ఆ ప్రాంత వాసుల గొంతు తడుస్తుంది. ఏ ఒక్కరో ఇద్దరో కాదు, ఏకంగా కోటీ డెబ్బై లక్షల ఆఫ్రికా అమ్మాయిల దయనీయ పరిస్థితి ఇది. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాల్లో (సబ్ సహారన్ ఆఫ్రికా) మంచి నీరు కోసం తిరుగుతున్న అమ్మాయిల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీరి మాన, ప్రాణాలకు ఏ మాత్రం రక్షణ ఉండకపోగా, బిందెడు నీటి కోసం రాత్రి పొద్దుపోయాక బయలుదేరడమో, లేక తెల్లవారు జాము 4 గంటలకు బయలుదేరడమో జరుగుతుందని సియర్రా లియోన్ మానవహక్కుల సంఘం వెల్లడించింది. యూనిసెఫ్, యూ.ఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ లతో పాటు పలు రిసెర్చ్ సంస్థల సంయుక్త డేటా ప్రకారం 30 లక్షల మంది బాలికలు, కోటీ నలభై లక్షల మంది మహిళలు నీటి కోసం తెల్లవారుజామునే వేట మొదలుపెడుతున్నారని వెల్లడయ్యింది. వీరి మాన, ప్రాణాలకు రక్షణ లేకపోవడం ఇక్కడ చాలా కామన్ విషయం కాగా, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల భారిన పడి చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరుగుతుండడం బాధాకరమని, వీరి జీవితాలపై అధ్యయనం చేసిన జై గ్రహమ్ రాయిటర్స్ కి ఇచ్చిన ఇంటర్వూలో అన్నారు. సబ్ సహారన్ ఆఫ్రికాలోని 24 దేశాల్లో వీరు పరిశోధనలు చేయగా అబ్బాయిలు ఆహారం కోసం పోరాటం చేస్తుంటే, అమ్మాయిలు నీటి కోసం సర్వస్వాన్ని కోల్పోతున్నారని వెల్లడించారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లు దాటిపోతుందని అంచనా వేస్తున్న తరుణంలో, ఈ నీటి కొరత మరీ తీవ్ర స్థాయికి చేరుతుందని ఐక్య రాజ్యసమితి పేర్కొంటోంది.

More Telugu News