: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు సొరంగం రెడీ... నేడే తొలిరైలు పయనం!

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగం (రైల్‌ టన్నెల్‌) ఇవాళ (జూన్‌ 1) ప్రారంభం కానుంది. 57 కిలోమీటర్ల (35మైళ్ల) పొడవైన ఈ రైల్వే సొరంగం డిజైన్ 1947లోనే పూర్తికాగా.. నిర్మాణ వ్యయం తట్టుకోలేకపోయిన స్విడ్జర్లాండ్ రైల్వే.. చివరకు 1999లో పనులను ప్రారంభించింది. దాదాపుగా రూ.83 వేల కోట్ల ఖర్చుతో 17 ఏళ్లపాటు జరిగిన రైలు సొరంగం నిర్మాణ పనులు ఈ మధ్యనే పూర్తికావడంతో.. 69 ఏళ్ల కలను ఇవాళ సాకారం చేసుకోవడానికి రెడీ అయ్యింది స్విస్‌. సొరంగంలో నడిచే మొదటి రైలులో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హాలెండే, ఇటలీ ప్రధాని మట్టియో రెంజీలు పాల్గొంటారని స్విస్ రైల్వే తెలిపింది. టన్నెల్ పూర్తిస్థాయి రాకపోకలు డిసెంబరు నుంచి ప్రారంభం అవనుండగా.. జూరిచ్ నుంచి మిలాన్ నగరానికి మధ్య ప్రయాణం రెండున్నర గంటలు తగ్గిపోతుంది. కేవలం గంటలోనే ప్రయాణం పూర్తవుతుంది. రైలు సొరంగం పూర్తిచేయడానికి తాజాగా 125 మంది కార్మికులు మూడు షిఫ్టులలో 43,800 గంటలు నిర్విరామంగా పనిచేసి శ్లాబ్ ట్రాక్ పూర్తి చేశారని స్విస్ రైల్వే ప్రకటించింది.

More Telugu News