: జైషే చీఫ్ మసూద్, అతడి సోదరుడిపై రెడ్ కార్నర్ నోటీసులు!... జారీ చేసిన ఇంటర్ పోల్

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి, జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్ లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఇంటర్ పోల్ వారిద్దరిపై నేటి ఉదయం ఈ నోటీసులను జారీ చేసిందని ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలోనే పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు ఏడుగురు గరుడ కమెండోలను పొట్టనబెట్టుకున్నారు. ఆ తర్వాత ఎన్ఎస్జీ కమెండోల దాడిలో ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ భూభాగంలో ఉంటూనే ఈ దాడికి సూత్రధారిగా వ్యవహరించిన మసూద్... పాక్ నుంచే ఉగ్రవాదులను పంపాడని జాతీయ దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంటును సీబీఐ... ఇంటర్ పోల్ కు పంపి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరింది. దీంతో ఇంటర్ పోల్ వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.

More Telugu News