: జగన్ ను చంపేందుకు కుట్ర జరుగుతోంది: వైకాపా ఎమ్మెల్యే రాజన్న దొర

విజయనగరం జిల్లా సాలూరు వైకాపా ఎమ్మెల్యే రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తమ అధినేత జగన్ ను చంపడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించి జగన్ దీక్ష చేపడితే, మంత్రులు ప్రత్తిపాటి, కామినేని హేళన చేస్తున్నారని... ఇది వారికి తగదని చెప్పారు. సాలూరులో వైకాపా శ్రేణులు దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రుల దిష్టి బొమ్మలను తగులబెట్టేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల వైఖరిపై రాజన్న దొర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జగన్ దీక్షపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News