: '1956 స్థానికత నిబంధన'పై విమర్శలు గుప్పించిన వెంకయ్యనాయుడు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన '1956 స్థానికత నిబంధన'పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్థానికతకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించనంటూనే... స్పందించారు. దేశంలోని పౌరులు ఏ రాష్ట్రానికైనా వెళ్లవచ్చని, అక్కడ నివాసమేర్పరుచుకుని స్థానికులుగా రాష్ట్ర ప్రభుత్వ సౌకర్యాలను పొందవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికతకు సంబంధించి కొత్త నిబంధనలు పెట్టడం దేశానికి, రాష్ట్రాలకు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్, చంద్రబాబునాయుడు ఇటీవలే తనను మర్యాదపూర్వకంగా కలిశారని... రాజకీయాలు పక్కనబెట్టి తమ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని తాను వారికి సూచించానని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్న ప్రాజెక్టులు, సంస్థలు, నిధులను వీలైనంత తొందరగా ఇవ్వాలని చంద్రబాబు తనను కోరారని... తప్పకుండా వాటి విషయంలో తాను శ్రద్ధ తీసుకుంటానని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

More Telugu News