: వ్యాపార సంస్థల బోర్డులు ఉగాదిలోగా తెలుగులోకి మార్చుకోవాలి
అన్ని
స్థాయీలలోనూ తెలుగు భాషను అమలు చేసే క్రమంలో ప్రభుత్వం మరో ముందడుగు
వేసింది. రాష్ట్రంలోని అన్ని వ్యాపార సంస్థలు తమ షాపుల ముందు ఏర్పాటు చేసే
సైన్ బోర్డులను (నామ ఫలకాలు) కచ్చితంగా తెలుగులోనే ఉండేలా
ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వచ్చే ఉగాది లోగా తమ బోర్డులను తెలుగులో
ఏర్పాటు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర కార్మిక శాఖ కమీషనరు
రామాంజనేయులు హెచ్చరించారు.
ఈ విషయంలో నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా
వ్యవహరించే వాణిజ్య సంస్థలపై ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
తమ ఆదేశాలను పట్టించుకోని వ్యాపార సంస్థల వద్దకు తమ సిబ్బందితో వెళ్లి,
ఆంగ్లంలో వున్న బోర్డులను తొలగించి, తెలుగులో బోర్డులను తామే ఏర్పాటు
చేస్తామనీ, అందుకు అయ్యే ఖర్చును జరిమానా సహా వసూలు చేస్తామనీ కార్మిక శాఖ
కమీషనరు హెచ్చరించారు.