ఆబ్దిక నియమాలు

ఆబ్దిక నియమాలు
పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెందినట్టుగా భావిస్తాడు.

ఈ నేపథ్యంలో ఆబ్దిక సమయంలో కొన్ని నియమాలను తప్పని సరిగా పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఆబ్దిక సమయంలో యజమాని ఉత్తరీయం ధరించకూడదు. అలాగే ఆయన ఇల్లాలు కూడా ఏక వస్త్రాన్ని మాత్రమే ధరించవలసి వుంటుంది. ఆ రోజున నామమాత్రంగానే దైవారాధన చేయాలి. పూజ కుంకుమ .. గంధం వంటివి ధరించకూడదు. వంట చేస్తున్నప్పుడు గానీ, వడ్డిస్తున్నప్పుడు గాని వంట పాత్రల చప్పుడు కానీయకూడదు.

భోక్తలకు మౌనంగా వడ్డిస్తూ వెళ్ళాలే గానీ, మరి కాస్త వడ్డించమంటారా అని అడగకూడదు. బ్రాహ్మణులు భోజనం చేశాక, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి అక్కడ పసుపుతోను .. పిండితోను ముగ్గుపెట్టాలి. బ్రాహ్మణులు భోజనం చేసి వెళ్ళేంత వరకూ ఎవరికీ బిక్ష వేయకూడదు. బిక్షకులు ఈ విషయాన్ని గ్రహించాలనే, ఆ ఇంటి ముందు ముగ్గుపెట్టకపోవడం జరుగుతుంది.

భోజనం చేసి వెళుతోన్న బ్రాహ్మణులను నవ్వుతూ సాగనంపకూడదు. ఏ కారణంగా గాని వారిని వెనక్కి పిలవకూడదు. ఈ విధమైన నియమాలను పాటించడం వలన, ఎలాంటి దోషాలు లేకుండా పితృ దేవతలను సంతృప్తి పరిచినట్టు అవుతుంది.

More Bhakti Articles