అన్నపురాశిని ఆరగించిన సిద్ధయ్య

అన్నపురాశిని ఆరగించిన సిద్ధయ్య
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన బోధనలతో అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలా ఆయన తన శిష్యులతో కలిసి నంద్యాలకి చేరుకున్నాడు. బ్రాహ్మంగారి రాక గురించి తెలియగానే, గ్రామస్తులలో చాలామంది ఆయన దర్శనార్ధం వచ్చారు. ఆ మహనీయుడిని చూడటమే తమ అదృష్టంగా భావించారు. ఆయన చేసిన బోధనలను వారంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలకించారు.

అయితే ఆ ప్రాంతానికి చెందిన విశ్వబ్రాహ్మణులెవరూ ఆయన దగ్గరికి రాలేదు ... మర్యాద పూర్వకంగా ఆయనని భోజనానికి కూడా ఆహ్వానించలేదు. తనపట్ల వారికి గల చులకన భావమే అందుకు కారణమని గ్రహించిన బ్రహ్మంగారు, సిద్ధయ్యను వెంటబెట్టుకుని వారి దగ్గరికే వెళ్లాడు. తనని తాను తక్కువ చేసుకుని మాట్లాడుతూ, తమకి భోజనం ఏర్పాటు చేయమని అడిగాడు.

తమ స్థాయిని తెలియజేయడం కోసం వాళ్లు బస్తాలకొద్దీ బియ్యం తెప్పించి బండెడు అన్నం వండి వార్చారు. అన్నాన్ని రాశిగా పోసి అది సరిపోతుందా? అని అడిగారు. అందులోని వ్యంగాన్ని అర్ధం చేసుకున్న బ్రహ్మంగారు, అది తన శిష్యుడికే సరిపోదని చెప్పి భోజనం చేయమని సిద్ధయ్యని ఆదేశించాడు. క్షణాల్లో సిద్ధయ్య ఆ అన్నపు రాశిని ఆరగించి, ఆకలి తీరలేదని చెప్పాడు. దాంతో ఉరుకుల పరుగుల మీద మళ్ళీ వండించి పెట్టారు. ఈసారి కూడా సిద్ధయ్య అలాగే చేయడంతో వాళ్లంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

శిష్యుడి ఆకలే తీర్చలేని తమకి బ్రహ్మంగారి ఆకలి తీర్చడం అసాధ్యమనే విషయం వారికి అర్ధమైపోయింది. తన శిష్యులలో ఒకరికి కడుపునిండుగా భోజనం పెట్టలేని వాళ్లు, సంపన్నులమని విర్రవీగడం సరికాదని వాళ్ల కళ్ళు తెరిపించాడు బ్రహ్మంగారు. దాంతో తమ అజ్ఞానాన్ని మన్నించమంటూ వాళ్లంతా ఆయన పాదాలపై పడ్డారు. ఆయన బోధనలతో చైతన్యవంతులై సమాజ శ్రేయస్సుకు తమవంతు కృషి చేశారు.

More Bhakti Articles