తామ్రపర్ణి

తామ్రపర్ణి
'తామ్రపర్ణి' ... అంటే 'రాగి ఆకు' అని అర్థం. ఈ నదిలోని ఇసుక ... నీరు రాగి రంగులో ఉంటాయి. నదీ తీరంలో రాగి రంగు ఆకులు గల వృక్షాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఈ కారణంగానే ఈ నదికి 'తామ్రపర్ణి' అనే పేరు వచ్చినట్టు చెబుతారు. విశిష్ట గుణాలు కలిగిన శంఖాలను ... అరుదైన ముత్యాలను అందించడం ఈ నది ప్రత్యేకత.

రాగి రంగులో అందంగా కనిపిస్తూ ఆహ్లాదపరిచే ఈ నది, అగస్త్య పర్వతంలో పుట్టి తమిళనాడు - తిరునల్వేలి జిల్లా మీదుగా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. కైలాస పర్వతంపై శివపార్వతుల కల్యాణం జరిగిన తరువాత, అగస్త్యుడు దక్షిణ భారత దేశ యాత్రలకు బయలుదేరాడు. ఆ సమయంలో తనకి లభించిన 'పద్మమాల'కు స్త్రీ రూపాన్ని ప్రసాదించి, 'తామ్రపర్ణి' పేరుతో జీవనదిగా ప్రవహిస్తూ జీవుల దాహార్తిని తీర్చమని చెప్పాడు. దాంతో తామ్రపర్ణి అగస్త్యుడిని అనుసరిస్తూ వుండగా, ఆయన ఆ నదీ తీరం వెంట అనేక పుణ్య తీర్థాలను స్థాపిస్తూ వెళ్లాడు. అలా ఆయన ఇటు దేవతలు ... అటు మానవులు స్నానమాచరించదగిన 118 పుణ్య తీర్థాలను స్థాపించినట్టు స్థల పురాణం చెబుతోంది.

తామ్రపర్ణి అనేక ప్రవాహాలను తనలో కలుపుకుంటూ అంబ సముద్రానికి కొంత దూరంలోని కొండలపై నుంచి దూకుతుంది. ఈ జలధారలతో ఏర్పడినదే 'పాపనాశ తీర్థం'. ఈ జలాలతో స్నానం చేసిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నదీ తీరంలో కొలువుదీరిన శివ కేశవ క్షేత్రాలను విశేష సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు. ఈ నది పవిత్రతను గురించి ... దీనిలో స్నానమాడటం వలన కలిగే పుణ్య ఫలాల గురించిన ప్రస్తావన పురాణాలలో కనిపిస్తుంది.

More Bhakti Articles