వరద వినాయక

వరద వినాయక

వరద వినాయక
కోరిన వరాలను ప్రసాదించే వరద వినాయకుడి క్షేత్రం రాయఘడ్ జిల్లాలోని ఖిలాపూర్ తాలూకాలోని మహాడ్ లో వుంది. ఈ క్షేత్రం ఇక్కడ వెలవడానికి కారణమైన గాథ 'గణేశ పురాణం'లో కనిపిస్తోంది. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు వేటకి వెళ్లి, అలసిన కారణంగా 'వాచక్నవి' అనే ముని ఆశ్రమానికి వెళ్లాడు. ఆయనకి ముని తగిన మర్యాదలు చేసి నదీ స్నానానికి వెళ్ళాడు.

ఆ సమయంలో ఆ రాజుపట్ల ముని భార్య ముకుంద ఆకర్షితురాలైంది. తన కోరికను తిరస్కరించిన రుక్మాంగదుడి పట్ల ముకుంద ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ... రుక్మాంగదుడి రూపంలో ముకుందను వశపరుచుకున్నాడు. ఫలితంగా ఆమెకు గృత్సమదుడు జన్మించాడు.

యువకుడైన గృత్సమదుడు ఓ రోజున మిగతా ముని కుమారులతో కలిసి శాస్త్ర విద్యలో పాల్గొనబోగా అతను ముని కుమారుడు కాదంటూ మిగతావారు పరిహసించారు. దాంతో తల్లిని నిలదీసిన గృత్స మదుడుకి తనని అవమానించిన వారి మాటలు నిజమేనని తెలుస్తుంది. అతని తండ్రి ఇంద్రుడని ఆకాశవాణి పలకడంతో ముకుంద కూడా ఆశ్ఛర్యపోతుంది

ఆ బాధని మరిచిపోవడం కోసం చాలాకాలం పాటు వినాయకుడి కోసం గృత్సమదుడు తపస్సు చేశాడు. వినాయకుడు ప్రత్యక్షమై అతని ఆవేదనను తొలగించడంతో, అక్కడే వెలసి భక్తుల బాధలు తీర్చమని గృత్సమదుడు కోరాడు. ఫలితంగా వెలసిన క్షేత్రమే ఈ 'వరద వినాయక' క్షేత్రం. కోరిన కోరికలు నెరవేర్చే ఈ స్వామి దర్శనానికి వచ్చే భక్తులతో నిత్యం ఈ ప్రదేశం సందడిగా కనిపిస్తూ వుంటుంది.

More Bhakti Articles