రామాయణ కాలంతో ముడిపడిన చదలవాడ

రామాయణ కాలంతో ముడిపడిన చదలవాడ

తండ్రి ఆజ్ఞ మేరకు సీతను .. లక్ష్మణుడిని వెంటబెట్టుకుని శ్రీరామచంద్రుడు అడవులకు బయలుదేరతాడు. శూర్పణఖకి జరిగిన అవమానం గురించి తెలుసుకున్న రావణాసురుడు, పథకం ప్రకారం సీతమ్మవారిని అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతమ్మవారి జాడను తెలుసుకోవడానికి బయలుదేరుతారు. ఈ ప్రయాణంలోనే వాళ్లకి హనుమంతుడు తారసపడతాడు. ఆయన ద్వారా సుగ్రీవుడితో పరిచయమవుతుంది.

సీతమ్మవారిని వెతికే బాధ్యత తమదంటూ శ్రీరాముడి మనసు కుదుటపడేలా సుగ్రీవుడు చేస్తాడు. ఆ తరువాత సుగ్రీవుడి ఆదేశం మేరకు వానర సైన్యం బయలుదేరుతుంది. అలా సీతాన్వేషణకి బయలుదేరిన వానర సైన్యం ఒక ప్రదేశంలో నాలుగు జట్లుగా విడిపోయి .. నాలుగు దిక్కులకి వెళ్లారట. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి 'చతుర్వాడ'అనే పేరు వచ్చిందనీ .. కాలక్రమంలో అది 'చదలవాడ'గా మారిందని అంటారు. రామాయణ ఘట్టాలతో ముడిపడిన ప్రాచీన క్షేత్రాలలో చదలవాడ ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రాచీనకాలం నాటి పరమేశ్వరుడి ఆలయం .. రఘునాయక ఆలయం దర్శనమిస్తూ ఉంటాయి. ఈ క్షేత్రం పరమ పవిత్రమైనదనీ .. మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తుంటారు.           

More Bhakti Articles