భైరవకోనలో వినిపించే కథ!

భైరవకోనలో వినిపించే కథ!
ప్రకృతి అందచందాలకు భగవంతుడుకూడా పరవశించిపోతాడు. తనకి ఇష్టమైన చోటున కొలువై సేదతీరుతుంటాడు. తనని వెతుక్కుంటూ వచ్చిన భక్తులను చూసి ముచ్చట పడుతుంటాడు. వాళ్ల కోరికలను నెరవేర్చి సంతోషపడుతుంటాడు. అలా మహాదేవుడు కొలువైన ప్రదేశమే 'భైరవకోన'. ప్రకాశం జిల్లాలోని ఈ క్షేత్రం .. సిద్ధక్షేత్రంగా .. మహిమాన్విత క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇక్కడి కొండగుహలు భగవంతుడి ఆదేశం మేరకు తొలచబడ్డాయని అంటారు.

ఇద్దరు అన్నదమ్ములు ఈ గుహలను తొలిచారనే కథలు వినిపిస్తుంటాయి. కొన్ని క్షేత్రాల్లో ఆశ్చర్యచకితులనుచేసే కొన్ని శిల్పాల రూపకల్పనలోను అన్నదమ్ముల కథలు వినిపిస్తూ వుంటాయి. అలాగే ఈ క్షేత్రంలో గల గుహలను అన్నదమ్ములు తొలిచినట్టుగా చెప్పుకుంటూ వుంటారు. తాము ఇతరుల కంట పడకుండా ఉన్నంతవరకే ఈ కొండలలో గుహలను తొలుస్తూ వెళ్లాలని ఇద్దరన్నదమ్ములు ఒక నియమాన్ని పెట్టుకున్నారట.

అలా కొన్ని గుహలను తొలిచిన తరువాత ఇతరుల కంట పడటంతో, తమ పనికి స్వస్తి పలికి ఇక్కడే వున్న ఒక సొరంగ మార్గంలోకి వెళ్లి అదృశ్యమైపోయారని చెబుతుంటారు. ఇలా ఈ క్షేత్రంలో ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో వినిపిస్తుంటాయి. ఎన్నో విశేషాలు .. మరెన్నో మహిమలు కనిపిస్తుంటాయి. దేవతలు .. మహర్షులు .. సిద్ధులు తిరుగాడే ఈ పవిత్ర ప్రదేశంలో అడుగుపెట్టడమే అదృష్టమనిపిస్తుంది. అనిర్వచనీయమైన ఆ అనుభూతిని పది కాలాలపాటు పొందాలనిపిస్తుంది.

More Bhakti Articles