దైవానికి ఇష్టమైన ఫలాలు సమర్పించాలి

దైవానికి ఇష్టమైన ఫలాలు సమర్పించాలి
చైత్రశుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు 'వసంత నవరాత్రులు' జరుగుతుంటాయి. నూతన సంవత్సరంలోని తొలి తొమ్మిదిరోజులు శ్రీరాముడిని పూజించడం వలన సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది. చైత్రశుద్ధ నవమి రోజున సీతారాములకు అంగరంగవైభవంగా కల్యాణమహోత్సవం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వైష్ణవ సంబంధమైన ఆలయాలలో కనిపించే సందడి అంతాఇంతా కాదు.

గ్రామాలలో అయితే అంతా ఈ రోజున ఆలయం దగ్గరే వుంటారు. సీతారాముల కల్యాణమంటే ప్రతిఒక్కరూ అది తమ కుటుంబానికి సంబంధించిన వేడుకలా ఉత్సాహం చూపుతుంటారు .. సంతోషంతో సందడి చేస్తుంటారు. ఈ రోజున ఎవరికి వారు తమ ఇంటిని మంగళకరంగా అలంకరించుకుంటారు. పూజామందిరంలో సీతారాముల ప్రతిమలను ఏర్పాటుచేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వివిధ రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

ఇక ఆలయానికి వెళ్లి కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తుంటారు. ఈ సమయంలోనే వివిధరకాల పండ్లను సమర్పిస్తుంటారు. సాధారణంగా ఆయా దైవాలకు ఇష్టమైన ఫలాలను గురించి తెలుసుకుని సమర్పిస్తే, వారి అనుగ్రహం మరింత త్వరగా లభిస్తుందట. ఈ నేపథ్యంలో రాములవారికి అరటిపండ్లు .. జామపండ్లు .. కమలాపండ్లు ... దానిమ్మపండ్లు ఎంతో ఇష్టమైనవిగా చెప్పబడుతున్నాయి.

అందువలన స్వామివారి దర్శనానికి వెళుతున్నప్పుడు ఈ ఫలాలను తీసుకువెళ్లడానికి ప్రయత్నించాలి. స్వామివారికి ప్రీతికరమైన ఈ పండ్లను సమర్పించడం, ఆయన పట్ల గల ప్రేమానురాగాలకు నిదర్శనంగా నిలుస్తుంటుంది. స్వామికి మనసుకి సంతోషాన్ని కలిగించడం కన్నా కావలసిన ఆనందం ఏవుంటుందని అనిపిస్తుంది.

More Bhakti Articles