శ్రీ రామావతారం

బ్రహ్మ మానస పుత్రుల శాపం కారణంగా వైకుంఠ ద్వార పాలకులైన జయ - విజయులు ... రావణ - కుంభ కర్ణులుగా జన్మించారు. వారిని శిక్షించడం కోసమే శ్రీ మహా విష్ణువు ... శ్రీ రాముడిగా భూలోకాన అవతరించాడు. శ్రీ మహా విష్ణువు ... శ్రీ రాముడుగా అవతరించగా, ఆయన శంఖు చక్రాలు ... వాసుకి అనే సర్పం ... లక్ష్మణ - భరత - శత్రుఘ్నులుగా అవతరించారని చెప్పబడుతోంది.
దశరథుడి భార్యలైన కౌసల్య - కైకేయి - సుమిత్రలలో ... కౌసల్యకి రాముడు జన్మించగా, కైకేయికి భరతుడు ... సుమిత్రకు లక్ష్మణుడు .. శత్రుఘ్నుడు జన్మించారు. విశ్వామిత్రుడు కోరిక మేరకు రాముడు యాగ రక్షణ చేస్తాడు. ఆయన మాటమేరకు, మిథిలా నగరానికి రాజు అయినటువంటి జనకుడి కుమార్తె అయిన సీతాదేవి స్వయంవరంలో పాల్గొంటాడు. శివ ధనుస్సును విరిచి సీతను వివాహమాడతాడు.
సీతను రాముడు అయోధ్యకు తీసుకు వచ్చి తనవారినందరినీ పరిచయం చేస్తాడు. ఆ సమయంలోనే దశరథ మహారాజు, శ్రీ రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు. మంథర అనే దాసీ మాట విని ... తన కొడుకైన భరతుడికే రాజ్యాధికారం దక్కాలని కైకేయి పట్టుబడుతుంది. అంతే కాకుండా రాముడు 14 సంవత్సరములపాటు అరణ్య వాసం చేయాలని షరతు పెడుతుంది. తండ్రి మాట జవదాటని రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై అడవులకు బయలుదేరతాడు.
అడవిలో తిరుగాడుతోన్న రామలక్ష్మణులపై రావణాసురుడి సోదరి శూర్పణఖ మనసు పారేసుకుంటుంది. ఆమె చేష్టలు సృతిమించడంతో లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులు కోసి పంపిస్తాడు. తన సోదరికి జరిగిన అవమానానికి ప్రతిగా రావణుడు సీతను అపహరిస్తాడు. హనుమంతుడి సాయంతో ... సుగ్రీవుడి బలగంతో రాముడు రావణాసురుడిని ఎదిరిస్తాడు. విభీషణుడు మినహా రావణ - కుంభకర్ణులతో సహా అందరినీ సంహరిస్తాడు.
రావణుడి చెరలోనున్న సీత ... పరమ పునీత అనే విషయాన్ని లోకానికి తెలియడం కోసం రాముడు ఆమెతో అగ్ని ప్రవేశం చేయిస్తాడు. ఆ తరువాత సీతా లక్ష్మణ హనుమ సమేతుడై అయోధ్యకి చేరుకుంటాడు. అయితే ఈ క్రమంలో ఆదర్శ వంతుడైన కొడుకు ... భర్త ... సోదరుడు ... శిష్యుడు ... ప్రభువు ... తండ్రి ... ఎలా ఉండాలనేది శ్రీ రాముడు ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. లోక కల్యాణాన్ని ఆశించి రాముడిగా జన్మించిన విష్ణుమూర్తి, ఓ సాధారణ మానవుడిగానే కష్టాలను ఎదుర్కుంటూ ధర్మ మార్గాన్ని అనుసరించి ... ఆచరించి చూపాడు.