ఆ ఆలయంలో అదో అద్భుతం !

ఆ ఆలయంలో అదో అద్భుతం !
ప్రాచీనకాలానికి చెందిన ఏ పుణ్య క్షేత్రాన్ని దర్శించినా, ఆనాటి శిల్పకళా వైభవం గురించి తెలుస్తుంది. ఆనాటి రాజులు శిల్పకళ పట్ల తమకి గల అభిరుచిని, ఆలయాల ద్వారా ఆవిష్కరించారు. ముందుతరాల వారికి శిల్పకళా సంబంధమైన విషయాలను తెలియపరచడం కోసం వాళ్లు ఆలయాలను వేదికలుగా చేసుకున్నారు. ఇందు కోసం సంవత్సరాల తరబడి కష్టపడ్డారు.

ఈ కారణంగానే గోపురాలు ... ప్రాకారాలు ... మంటపాలు ... స్తంభాలు ... పుష్కరిణిలు ... ఇలా అన్ని చోట్ల అద్భుతమైన రీతిలో శిల్పాలను తీర్చిదిద్దారు. హరికథల ద్వారా మాత్రమే పురాణాల గురించి వినే సాధారణ ప్రజలు, ఆలయాలలో శిల్పాలతో మలచబడిన దృశ్య రూపాలను గురించి తెలుసుకుని అర్థం చేసుకునే వాళ్లు. ఇక ఆనాటి శిల్పులు ఆలయం మొత్తానికి ప్రధాన ఆకర్షణగా, శిల్ప సంబంధమైన ఏదో ఒక కళాకృతిని మలిచేవాళ్లు.

ఈ నేపథ్యంలోనే ఏకశిలా రథాలు .. వేలాడే రాతి స్తంభాలు .. ఊయలలూగే మంటపాలు .. సప్తస్వారాలను పలికించే స్తంభాలు .. మనకి కనిపిస్తూ వుంటాయి. ఇలా శిల్పకళా వైభవానికి మచ్చుతునకగా నిలిచిన అలనాటి ఆలయాలలో 'సుచీంద్రం' ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి ఆలయంలో గల స్తంభాలు సైతం వివిధ స్వరాలను పలికిస్తూ వుండటం విశేషం. ఇక ఇక్కడ గల ఒక విగ్రహం చెవిలో సన్నని తీగను దూరిస్తే అది మరో చెవి గుండా బయటికీ వస్తుంది.

ఇంతేనా అనిపించేలా వున్నా శిల్పకళకు సంబంధించినంత వరకూ ఇది అంత ఆషామాషీ విషయమేం కాదు. ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ఈ ఒక్క శిల్పాన్ని నిర్వచనంగా చెప్పుకోవచ్చు ... నిదర్శనంగా చూపించుకోవచ్చు. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు తప్పనిసరిగా ఈ విగ్రహాన్ని తిలకిస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించినంత వరకూ ఇది ఒక అద్భుతమేనని అంగీకరిస్తారు.

More Bhakti Articles