వాస్తు దోషాలు సరిచేసిన శివుడు

వాస్తు దోషాలు సరిచేసిన శివుడు
భక్తులను అనుగ్రహించడం కోసమే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవుడు, ఆ భక్తుల ద్వారానే తన జాడను లోకానికి తెలియజేస్తూ ఉంటాడు. అలా ఒక భక్తుడి ద్వారా వెలుగు చూసిన శైవ క్షేత్రం మనకి కర్నూలు జిల్లా 'అక్కంపల్లి' సమీపంలో దర్శనమిస్తుంది. సాధారణంగా కలలో దేవుడు కనిపించడం .. తన ఆచూకీని తెలిపి ఆలయాన్ని నిర్మించమనడం జరుగుతూ వుంటుంది.

అయితే భక్తుడు నిర్మిస్తోన్న ఆలయాన్ని స్వామి దగ్గరుండి పర్యవేక్షిస్తూ, వాస్తు దోషాలను సరిచేసిన సంఘటన ఈ క్షేత్రంలోనే కనిపిస్తుంది. చెన్నబసప్ప అనే భక్తుడు స్వామివారి ఆదేశం మేరకు ఇక్కడి కొండపై ఆలయాన్ని నిర్మించడం మొదలుపెడతాడు. భార్యతో సహా కొంతమంది కూలీలు ఈ పనిలో పాల్గొనేవాళ్లు. రోజంతా కష్టపడి పనిచేసి ఆ కొండపైనే పడుకునేవాళ్లు.

మరునాడు పనిలోకి వెళ్లిన వాళ్లకి, అంతకు ముందురోజు తాము చేసిన పనికి సంబంధించి మార్పులు కనిపించడం చూసి ఆశ్చర్యపోయే వాళ్లు. ఈ మార్పులు ఎవరు చేస్తున్నారో వాళ్లకి అర్థంకాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఓ రాత్రివేళ చెన్నబసప్ప భార్యకి ఏదో అలికిడి వినిపిస్తుంది. లేచి చూసిన ఆమెకి శివుడు .. ఆయన గణాలు ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను సరిచేస్తూ కనిపించారట. ఆ దృశ్యాన్ని ఆమె భర్తకు చూపించింది ... దంపతులిద్దరూ ఆనందంతో పొంగిపోయారు.

అలా ఇక్కడి ఆలయ నిర్మాణం పరమశివుడి పర్యవేక్షణలో కొనసాగినట్టుగా స్థల పురాణం చెబుతోంది. సదాశివుడు ఇష్టపడి .. దగ్గరుండి ఈ ఆలయనిర్మాణంలో పాలుపంచుకున్న కారణంగా ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని స్థానికులు చెబుతుంటారు. ఓంకారేశ్వరుడు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటోన్న శివుడు గురించీ, ఆయన మహిమలను గురించి స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు.

More Bhakti Articles