దుష్టులకు లభించే ఫలితం ఇదే !

దుష్టులకు లభించే ఫలితం ఇదే !
అత్రి మహర్షి - అనసూయ పొందుతున్న కీర్తి ప్రతిష్ఠలను సదానందుడు సహించలేకపోతాడు. చిత్రకూటం నుంచి ఆ దంపతులను తరిమివేయడానికి తాను వేసిన పథకాలు ఫలించకపోవడంతో ఆయన పూర్తిగా డీలాపడిపోతాడు. అత్రి - అనసూయలు జీవించి ఉన్నంతవరకూ తాను కోరుకునే పెద్దరికం తనకి దక్కదని అనుకుంటాడు. అందువలన వాళ్లిద్దరినీ సజీవ దహనం చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఓ అర్థరాత్రివేళ అత్రి - అనసూయలు ఆశ్రమంలో నిద్రిస్తూ ఉండగా అక్కడికి చేరుకుంటాడు. ఆశ్రమానికి నిప్పుపెడదామని ప్రయత్నిస్తూ ఉండగా, ఆశ్రమం కనిపించకుండాపోతుంది. ఆశ్రమంలో దీపాలు ఆర్పడమే అందుకు కారణమని అనుకుంటాడు సదానందుడు. తన చేతిలో వున్న కాగడా వైపు చూసుకున్న ఆయన దాని వెలుగు కూడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు.

తనకి చూపుపోయిందనే విషయం అర్థం కావడంతో సదానందుడు కంగారుపడిపోతాడు. అత్రి దంపతులకి హాని తలపెట్టడానికి తాను ప్రయత్నించడమే అందుకు కారణమని ఆయన గ్రహిస్తాడు. పశ్చాత్తాపంతో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ వుండగా, అలికిడి విని అత్రి దంపతులు అక్కడికి వస్తారు. ఆప్యాయంగా వాళ్లు పలకరించడంతో ఒక్కసారిగా పాదాలపై పడిపోయి, జరిగినదంతా చెబుతాడు సదానందుడు.

ఆ దంపతులు పరమేశ్వరుడిని ప్రార్ధించి ఆయనకి చూపువచ్చేలా చేస్తారు. అసూయ ద్వేషాలతో పాపాలకు ఒడిగట్టినప్పటికీ, పెద్దమనసుతో తనని మన్నించిన ఆ పుణ్య దంపతులకు సదానందుడు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఎవరి దుష్ట స్వభావం వారినే దహించి వేస్తుందనే సత్యాన్ని తెలుసుకున్నానంటూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ రోజు నుంచి సన్మార్గాన్ని ఎంచుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు.

More Bhakti Articles