భక్తులను వెన్నంటి వుండే భగవంతుడు

భక్తులను వెన్నంటి వుండే భగవంతుడు
భగవంతుడు నిజమైన భక్తులను ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు. అనుక్షణం వారి అవసరాలను గుర్తిస్తూ ... ఆపదల్లో చిక్కుకోకుండా కాపాడుతూ ఉంటాడు. తనపై భారం వేసిన భక్తుడిని చివరివరకూ వెంటవుండి ఆయన నడిపిస్తూ వుంటాడు. మహాభక్తుడైన ప్రహ్లాదుడిని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయనని అంతమొందించడానికి హిరణ్యకశిపుడు చేసిన ప్రతి ప్రయత్నానికి శ్రీమహావిష్ణువు అడ్డుపడతాడు.

ఆ తరువాత కూడా తన భక్తులకు దుష్ట స్వభావంగల వారు కీడు తలపెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆయన రంగంలోకి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో తులసీదాస్ జీవితంలో జరిగిన సంఘటన కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రతిక్షణం ... ప్రతినిత్యం రామనామ స్మరణలో మునిగితేలిన మహాభక్తుడు తులసీదాస్.

నిజమైన భక్తులకు దొంగ భక్తుల నుంచి ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుందనేది చరిత్ర చెప్పిన సత్యం. ఒక రకంగా వీరి కారణంగానే నిజమైన భక్తుల గొప్పతనం గురించి లోకానికి తెలుస్తూ ఉంటుంది. అలాగే తులసీదాస్ ఎంతటి భక్తుడనేది తెలియడానికి రవిదత్తు కారకుడవుతాడు. ఒకసారి తులసీదాస్ ధ్యానంలో వున్న సమయంలో, ఆయన ఆశ్రమానికి రవిదత్తు నిప్పు అంటిస్తాడు.

ఆ విషయాన్ని అక్కడి వాళ్లు గుర్తించే సరికి మంటలు పెద్దవవుతాయి. వాటిని అదుపు చేయడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. ధ్యానంలో నుంచి తులసీదాస్ ను బయటికి తీసుకురావడం కోసం పెద్దగా పిలవడం .. అరవడం చేస్తుంటారు. ఇదంతా ఏమీతెలియని తులసీదాస్, రామనామ స్మరణలోని రసానుభూతిని పొందుతుంటాడు. ఇక తులసీదాస్ అగ్నికి ఆహుతి కావడం తథ్యమని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు.

అదే సమయంలో అదృశ్య రూపంలో శ్రీరామచంద్రుడు అక్కడికి చేరుకుంటాడు. తనపై తులసీదాస్ కి గల భక్తి శ్రద్ధలను చూసి మురిసిపోతాడు. ఆయన అనుగ్రహంతో అందరూ చూస్తుండగానే ఆ మంటలు ఆరిపోతాయి. ప్రత్యక్షంగా ఈ దృశ్యాన్ని చూసిన అక్కడివారికి తులసీదాస్ గొప్పతనం గురించి మరొకసారి తెలుస్తుంది. సంపూర్ణమైన విశ్వాసమే పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుందనే విషయం అర్థమవుతుంది.

More Bhakti Articles